బీసీ కుల గణన చేపట్టాలని ముఖ్యమంత్రికి లేఖలు
రథ సారథి, మిర్యాలగూడ :
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీసీల కులగణన నిర్వహిస్తున్న బీహార్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా బీసీల కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖలు రాసారు . ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ ఈనెల 21 నుంచి బీహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నారని, దీన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని కుల గణన చేపట్టడం ద్వారా ఆయా కులాల ఆర్థిక సామాజిక పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయన్నారు.బడ్జెట్లో కూడా ఆయా కులాల అభివృద్ధికి నిధులు కేటాయించడం సులభతరం అవుతుందని,ఏ కులం శాతం ఎంత ఉంటే చట్టసభల్లో ఆ కులానికి అన్ని సీట్లు కేటాయించేందుకు రాజకీయ పార్టీలకు కూడా మంచి అవకాశం దొరుకుతుందన్నారు.ఏ కులం శాతం ఎంత ఉంటే ఆ కులానికి అంత బడ్జెట్….చట్టసభల్లో అన్ని సీట్లు కేటాయిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.56% ఉన్న బీసీలకు కేవలం 17 శాతం సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీని అంతటికీ కారణం బీసీల జనాభా లెక్కలు సరిగ్గా లేకపోవడమేనని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది బీసీ మహిళలు ఓటు హక్కు కలిగి ఉన్నారని కానీ శాసనమండలిలో గాని శాసనసభలో కానీ ఒక్క బీసీ మహిళ కూడా ప్రాతినిధ్యo లేకపోవడం దురదృష్టకరమని ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, గుండెబోయన నాగేశ్వరరావు యాదవ్, జానపాటి రవి, ఫారూఖ్, దాసరాజ్ జయరాజ్, చేగొండి మురళి యాదవ్, మురళి ముదిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.