నల్గొండలో భర్త హత్య కేసు ఛేదన.. భార్య, ప్రియుడు అరెస్ట్
నల్గొండ, జూలై 16: నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నెల 11న జరిగిన ఇస్లావత్ గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు

నల్గొండ, జూలై 16: నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నెల 11న జరిగిన ఇస్లావత్ గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గోవింద్ భార్య ఇస్లావత్ సరోజతో పాటు ఆమె ప్రియుడు చెన్నబోయిన శ్రీనును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, సరోజకు అదే గ్రామానికి చెందిన శ్రీనుతో సుమారు ఆరు సంవత్సరాలుగా పరిచయం ఉండి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త గోవింద్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గోవింద్ను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 11వ తేదీ రాత్రి గోవింద్ ఇంట్లో నిద్రిస్తుండగా, ఇద్దరూ కలిసి అతని ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం సరోజ రోకలి బండతో దాడి చేయడంతో గోవింద్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం రక్తపు మరకలున్న దుస్తులు, సెల్ఫోన్లను దాచిపెట్టి ఇద్దరూ పరారైనట్లు వెల్లడించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వాడపల్లి పోలీసులు, నిందితులు నిర్జన ప్రాంతంలోని చెట్ల పొదల్లో తలదాచుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.