ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు మూడు రోజుల ఈడీ కస్టడీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న మాజీ ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్లకు నాంపల్లి ప్రత్యేక కోర్టు మూడు రోజుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని మంజూరు చేసింది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న మాజీ ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్లకు నాంపల్లి ప్రత్యేక కోర్టు మూడు రోజుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని మంజూరు చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. టెండర్ల నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో నిధుల మళ్లింపు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న నిర్ణయాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. విచారణలో లభించే సమాచారం ఆధారంగా కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ కేసులో నమోదైన ఆరోపణలు, వాటిపై నిందితుల వివరణలు, దర్యాప్తు సంస్థ సేకరిస్తున్న ఆధారాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.