Sangareddy

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

-బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం..... *అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18 (రథసారథి న్యూస్):
సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ పాండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన, బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని అన్నారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమాన హక్కులు, స్వేచ్ఛ లభించాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రజల కోసం ధైర్యంగా నిలబడిన ఆయన స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, బీసీ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button