జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ అధ్యాపకుల నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (రథసారథి న్యూస్): పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (శక్తి)లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి మండలం హనుమాన్నగర్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ జానకీదేవి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.20 గంటల వరకు సుమారు 15 మంది సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తిని తొలగించాలి.. పాలిటెక్నిక్లను కాపాడాలి అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి కింద విలీనం చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉందని అధ్యాపకులు పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను శక్తి (యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ)లో విలీనం చేయకూడదని, ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, క్యాబినెట్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే శక్తిని ప్రత్యేకమైన, ఉపాధి ఆధారిత నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా స్వతంత్రంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



