సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్): వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఉన్న శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు.
వినాయక నిమజ్జనం కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
మృతుల్లో నర్సింహరాజు (బీటెక్), సుమంత్ (డిప్లొమా 2వ సంవత్సరం), గణేష్ (డిప్లొమా 2వ సంవత్సరం), ఉదయ్కిరణ్ (డిప్లొమా 3వ సంవత్సరం), శామ్యూకుమార్ (డిప్లొమా 1వ సంవత్సరం), సిద్ధార్థ్ (10వ తరగతి) ఉన్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
