కేజీబీవీ విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన
-3 వేల శానిటరీ ప్యాడ్ల పంపిణీ.-పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్): బాలికల సంరక్షణ, విద్యను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పుల్కల్ కేజీబీవీలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రుతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్లను సక్రమంగా వినియోగించడం, వాటిని పరిశుభ్రంగా భద్రపరచడం, వినియోగం అనంతరం శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల అవసరాలను తీర్చేందుకు ప్యాడ్ బ్యాంకు ద్వారా 3 వేల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. బాలికల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినులతో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ మధులిక, మండల విద్యాధికారి శంకర్, ఎస్ఓ ఇంద్రజ, వైద్యాధికారి శ్వేత, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ పర్యవేక్షకులు, లింగ సమానత్వ నిపుణురాలు, ఆశా కార్యకర్త, విద్యార్థినులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదే విధంగా చౌటకూరు కేజీబీవీలోనూ విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.



