కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశ ప్రగతికి పునరంకితమవుదాం -ప్రతి పౌరుడు బాధ్యతను నెరవేర్చాలి -2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి-అదనపు కలెక్టర్ సంగీత

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ సంగీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.
స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని అన్నారు. ముఖ్యంగా యువత నూతన ఆలోచనలు, నైపుణ్యాలతో ముందుకు సాగుతూ..
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ దార్శనికతకు అనుగుణంగా చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆమె కోరారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా భావించి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
-విద్యార్థులకు మిఠాయిలు, నోట్బుక్ల పంపిణీ
అనంతరం విద్యార్థులకు అదనపు కలెక్టర్ సంగీత మిఠాయిలు, నోట్బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



