చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం -జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లాలో చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ మరియు ఫైలేరియా బాధితులు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ వివరాలు, అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
లబ్ధిదారుల దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాలు/మున్సిపల్ కార్యాలయాల ద్వారా చేయూత పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుందనీ ,దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత అర్హత ప్రమాణాల ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయబడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన పత్రాలతో తమకు సంబంధించిన మండల/మున్సిపల్ కార్యాలయాలలో సంప్రదించి కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.



