ఆగస్టు 15న సీఎం పర్యటనను అడ్డుకుంటాం
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి -ఏబీవీపీ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ రాజు హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రతి ఏడాది సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ధ్రువపత్రాలు పొందలేకపోతున్నారని, సెమిస్టర్ పరీక్షలకు హాల్టికెట్లు పొందడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాల ఒత్తిళ్లతో విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు.
అదేవిధంగా గత మూడు సంవత్సరాల్లో ఆహార కలుషితం, పాముకాటు, తేలుకాటు వంటి ఘటనలతో 118 మంది విద్యార్థులు మృతిచెందారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ధనరాజ్, జిల్లా వసతిగృహాల కన్వీనర్ సాయికృష్ణతో పాటు మనోహర్, సతీష్, లోకేష్, జగన్, కళ్యాణి, కీర్తన, నవనీత, పూజ, సంజన, శివమణి తదితరులు పాల్గొన్నారు.



