రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి -సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు మృతిచెందడం తీవ్ర విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జయరాజు విజ్ఞప్తి చేశారు.



