డీవైఎఫ్ఐ మహాసభలను జయప్రదం చేయాలి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొండాపూర్ మండలంలో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.అనిల్, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అతిమేల మాణిక్ పిలుపునిచ్చారు. మహాసభల కరపత్రాన్ని సంగారెడ్డిలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, ఉద్యోగ సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ముఖ్యంగా జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలపై చర్చించి, యువత సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు. మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి ఎంపికైన యువజన ప్రతినిధులతో పాటు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. మహాసభల విజయవంతానికి మిత్రులు, శ్రేయోభిలాషులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ నాయకుడు రాజయ్య, జిల్లా నాయకులు శ్రీకాంత్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.



