
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీ బుధవారం మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత (33), భర్త శ్రీశైలంతో కలిసి తొమ్మిది నెలల గర్భిణిగా ఈ నెల 10న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆమెకు బుధవారం ఉదయం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనిత మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు.
సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అనిత మృతిచెందిందని వారు ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వైద్యులు, వైద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.



