
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్):సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా వినాయకుని సన్నిధిలో నిర్వహించిన భజన కార్యక్రమంతో పట్టణంలోని మంజీరా నగర్ మెయిన్ రోడు భక్తిమయంగా మారింది.
సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి నైవేద్యం సమర్పించిన కమిటీ సభ్యులు అనంతరం భవాని భజన మండలి సభ్యులు భక్తి గీతాలు, భజనలతో స్వామివారిని కొలిచారు. గణపతి నామస్మరణతో మార్మోగగా, భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా భజన కార్యక్రమంలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ భజన కళాకారులు శాంతి కుమార్, శ్రీశైలం, నర్సింలు, మహేష్, కమిటీ సభ్యులు మాణిక్ ప్రభు, దత్తాత్రి, సాయినాథ్, శ్రీశైలం, పెంటయ్య, సురేష్, ఆంజనేయులు, రాము, శేఖర్, రమేష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.



