గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఉపవిభాగ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఉప పోలీసు అధికారి సైదా నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ శోభాయాత్రలు సాగే మార్గాల్లో రహదారుల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, నిమజ్జన ప్రాంతమైన నారింజ వాగు వద్ద ఏర్పాటు చేయాల్సిన కంచెలు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం అధికారులు సంబంధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జహీరాబాద్ ఉపవిభాగ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు



