పదవులు రాని కార్యకర్తలు నిరాశ చెందొద్దు
-పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను గుర్తిస్తా

సెప్టెంబర్ 30 నుంచి మండలాల వారీగా సమావేశాలు.. జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): పార్టీలో పదవులు లభించని కార్యకర్తలు ఎలాంటి నిరాశకు గురికావద్దని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను గుర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్లో నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా విభాగం, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్తో పాటు వివిధ అనుబంధ విభాగాల కమిటీలను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలో పదవులు వచ్చిన వారు, రాని వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గుర్తిస్తానని తెలిపారు. కార్యకర్తలంతా పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
-అధికారులతో అభివృద్ధిపై సమీక్ష
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన గెలిచిన, ఓడిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో అధికారుల సమక్షంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
అలాగే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి కార్యకర్తతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్లు తెలిపారు. సమావేశాలకు పోలీసు శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆహ్వానించి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.



