హామీలు వెంటనే అమలు చేయాలి: విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల మహాధర్నా
విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్): విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టిసన్ ఉద్యోగ నాయకులు మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న సమ్మె నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సేవలను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సానుకూలంగా పరిశీలించాలని కోరారు. హామీల అమలులో జాప్యం చేస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జేఏసీకి చెందిన పలువురు ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



