నారాయణఖేడ్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా స్థాయి సమావేశం
60 మంది కార్యకర్తల చేరిక – జిల్లా కన్వీనర్గా ఎస్. చిరంజీవి నియామకం

నారాయణఖేడ్, జూలై 22 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిస్టు పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు ఎస్. చిరంజీవి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు.
రాష్ట్ర నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో ఎస్. చిరంజీవిని పార్టీ జిల్లా కన్వీనర్గా నియమిస్తూ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోజి రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యదర్శి బి. రాములు యాదవ్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆశించిన స్థాయిలో పాలన అందించడం లేదని విమర్శిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమం, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్. చిరంజీవి, లక్ష్మణ్, మోచప్ప, గణేష్, సోయల్ శోభ, పండరి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



