సంగారెడ్డి ఆర్టీసీ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
కార్మికుల సమస్యలు పరిష్కరించి పాత మార్గాల్లో బస్సు సర్వీసులు పునరుద్ధరించాలి-తోపాజి అనంతకిషన్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ఆర్టీసీ డిపో అభివృద్ధితో పాటు కార్మికులు, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంతకిషన్ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సంగారెడ్డి డిపో మేనేజర్, డిప్యూటీ ప్రాంతీయ మేనేజర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనంతకిషన్ మాట్లాడుతూ..
కార్మికుల కారణంగానే సంగారెడ్డి ఆర్టీసీ డిపో నష్టాల్లో ఉందన్న విధంగా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. డిపోను లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి డిపో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. కార్మికులు, మహిళా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గతంలో నడిచిన మార్గాల్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచి డిపో అభివృద్ధికి అధికారులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజేఎంయూ అధ్యక్షుడు మహేందర్, కార్యదర్శి విక్రమ్, ప్రాంతీయ మహిళా కార్యదర్శి స్వరూప, డిపో మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి, యూనియన్ నాయకులు సరిత, అమరమ్మ, సాయన్న, రాములు, ప్రభాకర్, అనిల్, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



