Sangareddy

సర్వే నంబరు 656పై అపోహలు వద్దు

భూసమీకరణ ప్రక్రియపై కంది తహసీల్దార్‌ స్పష్టీకరణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 11 (రథసారథి న్యూస్):

కంది మండలం కంది గ్రామంలోని సర్వే నంబరు 656కు సంబంధించి సెప్టెంబర్‌ 10న ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్తలో పేర్కొన్న పలు ఆరోపణలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని కంది మండల తహసీల్దార్‌ స్పష్టం చేశారు.సర్వే నంబరు 656లోని పేదల అసైన్డ్‌ భూములను ఇతర ప్రయోజనాలకు మళ్లించారని, సుమారు 19 ఎకరాల భూమిని ప్రైవేటు వెంచర్‌ లేదా లేఅవుట్‌లోకి తీసుకెళ్లారని, అసైనీలకు తక్కువ మొత్తాలు చెల్లించే ప్రయత్నం జరిగిందని, సుమారు రూ.100 కోట్ల విలువైన భూ అక్రమాల్లో అధికారుల పాత్ర ఉందనే విధంగా వార్తలో ఆరోపణలు వచ్చినట్లు కంది మండల తహసీల్దార్‌ తెలిపారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 656 మొత్తం విస్తీర్ణం 222 ఎకరాల 19 గుంటలు కాగా, అందులో ప్రభుత్వ భూమి 77 ఎకరాల 23 గుంటలు మాత్రమేనని పేర్కొన్నారు. మిగిలిన భూమి వివిధ ఉపవిభాగాల్లో పట్టా, ఇనాం, వక్ఫ్‌ భూములుగా నమోదై ఉందని తెలిపారు. అందువల్ల సర్వే నంబరు 656 మొత్తాన్ని అసైన్డ్‌ ప్రభుత్వ భూమిగా పేర్కొనడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ భూమిలోని సంబంధిత భూములను 1972–73లో అర్హులైన లబ్ధిదారులకు అసైన్‌ చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 190, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, 18 అక్టోబర్ 2022 ప్రకారం చేపట్టిన భూసమీకరణ ప్రక్రియలో సంబంధిత అసైనీలు తమ భూములను స్వచ్ఛందంగా భూసమీకరణ పథకం కింద ఇచ్చేందుకు సమ్మతి తెలిపారని వివరించారు. అసైనీల లిఖితపూర్వక సమ్మతి ఆధారంగా 48 ఎకరాల 26 గుంటల భూమిని 23 డిసెంబర్ 2022న పంచనామా ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థకు అప్పగించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. అనంతరం పునఃసర్వే నిర్వహించి భూమి వాస్తవ భౌతిక స్థితిని నిర్ధారించిన తర్వాత సంబంధిత భూమికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కంచె ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పునఃసర్వే, క్షేత్రస్థాయి పరిశీలనలో గతంలో అసైనీల జాబితాలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమకు అసైన్‌ చేసిన ప్రభుత్వ భూమిలో కాకుండా, దానికి ఆనుకుని ఉన్న పట్టా భూముల్లో భౌతిక స్వాధీనంలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అసైనీలను వారి భూముల నుంచి అక్రమంగా తొలగించి, ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేటు వెంచర్‌కు అప్పగించినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా అసైనీల భూములను తక్కువ మొత్తాలకు తీసుకుని ఇతరులకు లాభం చేకూర్చేలా అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు, సుమారు రూ.100 కోట్ల విలువైన భూ అక్రమాలు జరిగాయన్న ప్రచారం కూడా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో సరిపోలడం లేదన్నారు. సర్వే నంబరు 656కు సంబంధించి రెవెన్యూ రికార్డులు, భూసమీకరణ ప్రక్రియ, పంచనామా, పునఃసర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ఆరోపణలు వాస్తవాలను ప్రతిబింబించవని కంది మండల తహసీల్దార్‌ హసీనా బేగం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button