విద్యారంగ సమస్యల పరిష్కారానికి తపస్ మహా ధర్నా
హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నుంచి 300 మంది ఉపాధ్యాయుల పాల్గొనడం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్):
విద్యారంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మహా ధర్నాలో సంగారెడ్డి జిల్లా శాఖ నుంచి సుమారు 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని వెంటనే నియమించి, విద్యారంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మహా ధర్నాలో తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర నాయకులు రమేష్, చంద్రశేఖర్, విజయ్ కుమార్, బస్వరాజ్, నర్సింలు, జిల్లా, డివిజన్, మండల స్థాయి నాయకులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



