ట్రైబల్ లా కాలేజీపై మంత్రి దామోదర రాజనర్సింహ కు కృతజ్ఞతలు
-రూ.35.50 కోట్లతో చౌటకూర్లో మంజూరు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (రథసారథి న్యూస్): మండల కేంద్రంలో రూ.35.50 కోట్ల వ్యయంతో ట్రైబల్ లా కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహకు గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, లంబాడాల పోరాట సమితి నాయకులు ప్రకాష్ రాథోడ్, మహేష్ రాథోడ్, మెగరాజ్ నాయక్ తదితరులు సంగారెడ్డిలో మంత్రిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం మిఠాయి తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చౌటకూర్లో ట్రైబల్ లా కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన విద్యార్థులకు న్యాయ విద్య మరింత చేరువవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఉన్నత విద్యతో పాటు న్యాయ రంగంలో గిరిజన యువత రాణించేందుకు ఈ కళాశాల దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దిశా కమిటీ సంగారెడ్డి జిల్లా సభ్యుడు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన న్యాయ విద్యను అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.
కళాశాల మంజూరుకు మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్, ఆందోల్ నియోజకవర్గ నాయకుడు మహేష్ రాథోడ్, మేఘరాజ్ నాయక్,ఎల్హెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, సర్పంచ్లు వినోద్, జైపాల్, సేనాపతి అశోక్, గోపాల్, రాజు, గణేష్ నాయక్, విద్యార్థులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.



