ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి -అదనపు కలెక్టర్ పాండు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 07 (రథసారథి న్యూస్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో ప్రధానంగా హాస్టల్స్ అడ్మిషన్లు, హౌసింగ్, పౌర సరఫరాలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు వస్తున్నాయని, ఆయా శాఖల అధికారులు వీటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 80 ఫిర్యాదులు, వినతులు అందాయని అధికారులు తెలిపారు.
ఇందులో కలెక్టరేట్లో 50, సంగారెడ్డి డివిజన్లో 24, జహీరాబాద్ డివిజన్లో 5, నారాయణఖేడ్ డివిజన్లో 1 ఫిర్యాదు, వినతి అందగా, అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అదేవిధంగా జిల్లాలోని మండల స్థాయిలో ఆందోల్, చౌటకూర్, గుమ్మడిదల, హత్నూర, ఝరాసంగం, జిన్నారం, కల్హేర్, కంది, కంగ్టి, కోహీర్, కొండాపూర్, మనూర్, మొగుడంపల్లి, మునిపల్లి, నాగలిగిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, న్యాల్కల్, పటాన్చెరు, పుల్కల్, రాయికోడ్, సదాశివపేట, సిర్గాపూర్, వట్టిపల్లి, సంగారెడ్డి, జహీరాబాద్ మండలాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 317 ఫిర్యాదులు, వినతులు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రజావాణిలో ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్, పెన్షన్లు, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్, ఎంప్లాయ్మెంట్, ఎస్సీ, బీసీ అభివృద్ధి, సహకార, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వ్యవసాయం, డీఆర్డీఏ, మిషన్ భగీరథ, నీటిపారుదల, ఆర్ సి ఓ- ఎస్సీ, ఎస్టీ, బీసీ , మున్సిపల్, విద్య, పౌర సరఫరాలు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, వక్ఫ్ బోర్డు తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు, వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



