సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు
-ప్రజాకవి సేవలను కొనియాడిన బీఆర్ఎస్ శ్రేణులు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాళోజీ తన కలం ద్వారా సమాజంలోని అసమానతలు, ప్రజల సమస్యలు, సామాజిక రుగ్మతలపై నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కాళోజీ నారాయణరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలిచి సామాజిక చైతన్యాన్ని పెంపొందించడమే కాళోజీకి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చింత సాయినాథ్, మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జీవీ శ్రీనివాస్, మసూద్, కసిని శ్రీకాంత్, వెంకటేష్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



