సెర్ప్–ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలకు బీహార్ గ్రూప్–1 అధికారుల ప్రశంసలు
-మహిళా సాధికారతకు చేస్తున్న కృషి అభినందనీయం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ కేంద్రంలో శిక్షణలో భాగంగా వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన 120 మంది గ్రూప్–1 అధికారుల బృందం సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్యను సందర్శించింది. ఈ సందర్భంగా అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) సెర్ప్–ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులకు వివరించారు. అనంతరం మహిళా వ్యాపారవేత్తలతో బీహార్ అధికారుల బృందం ప్రత్యేకంగా సమావేశమై వారి అనుభవాలను తెలుసుకుంది.
మహిళా శక్తి పెట్రోల్ బంక్, వాణిజ్య దుకాణ సముదాయం, ఫసల్వాడిలోని కేఎస్ఆర్ సాక్స్ తయారీ యూనిట్ను అధికారులు సందర్శించి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంపొందించడంలో సెర్ప్–మహిళా సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని బీహార్ గ్రూప్–1 అధికారుల బృందం ప్రశంసించింది. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొంది. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య కోశాధికారి, మహిళా సంఘాల సభ్యులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



