రాహుల్ కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర
-వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో జగ్గారెడ్డి స్వాగతం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (రథసారథి న్యూస్): రాహుల్గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లు గురువారం సంగారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆయనకు స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు. అనంతరం పాదయాత్రలో కొంతదూరం పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల మీదుగా సుమారు 1,590 కిలోమీటర్లు నడిచి దాదాపు 30 వేల మందిని కలుసుకున్నారని తెలిపారు. రహదారుల వెంట, టీ దుకాణాలు, హోటళ్లు, పొలాలు, పరిశ్రమల వద్ద ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4,500 కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్రలో రెండు లక్షలకు పైగా ప్రజలను కలుసుకోవాలని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్గాంధీ చేపట్టిన పాదయాత్రలు, దేశం కోసం ఆయన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను ప్రజలకు వివరిస్తూ వెంకటేశ్వర్లు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
పాదయాత్ర పూర్తయిన అనంతరం వెంకటేశ్వర్లును స్వయంగా తీసుకెళ్లి రాహుల్గాంధీని కలిపిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ కొనసాగుతున్న ఈ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.



