దరఖాస్తుపల్లి యువకుడి అనుమానాస్పద మృతి.. వట్టపల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి
వట్టపల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా వట్టపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ క్వారీలో పనిచేస్తున్న దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు చెట్టు నుంచి దించి తరలించారని ఆరోపిస్తూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించడం, ఘటనలో క్వారీ యాజమాన్యం పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు వట్టపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో స్టేషన్లోని ఫర్నిచర్, తలుపులు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



