శిశు గృహ, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీచంద్ర సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య గురువారం సంగారెడ్డిలోని శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాన్ని సందర్శించి అక్కడి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా శిశు గృహంలోని చిన్నారుల సంక్షేమం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సఖి కేంద్రంలో మహిళల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, కుటుంబ వివాదాల విషయంలో కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తూ సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డులో బాలల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తూ, తెలిసి తెలియక జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా బాలలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అవసరమైన వారు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని లేదా టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.



