సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు
-పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు-అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (రథసారథి న్యూస్): శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) చైతన్య రెడ్డి తెలిపారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడడం, చట్టవిరుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ప్రజలు శాంతియుత వాతావరణాన్ని పరిరక్షించేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తులు, నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి స్పష్టం చేశారు.



