సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం ఐలమ్మ
-రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప యోధురాలు -సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం చిట్యాల ఐలమ్మ అని, రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప యోధురాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సీపీఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాద శక్తులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
ఐలమ్మ ధైర్యసాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, రేవంత్, కృష్ణ, నాయకులు అశోక్, రమేష్గౌడ్, విఠల్, శివకుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



