పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. స్థానికుల్లో చర్చనీయాంశం
తాళానికి బదులు బేడీలు వేశారని అధికారుల వివరణ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు బేడీలు వేయడం గురువారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నేరస్థులకు ఉపయోగించే బేడీలు పోలీస్ స్టేషన్ గేటుకు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గేటుకు బేడీలు ఎందుకు వేశారంటూ పలువురు పోలీసులను ప్రశ్నించగా, దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు.
పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బయటి వ్యక్తులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయకుండా ఉండేందుకు గేటుకు తాళం వేయాలని సూచించామని, అయితే సిబ్బంది పొరపాటున తాళానికి బదులుగా బేడీలు వేసి ఉండవచ్చని ఒక అధికారి తెలిపారు. ఆ రోజు ఉన్నతాధికారుల సందర్శన ఉండటంతో గేటును మూసివేయాలని ఆదేశించామని చెప్పారు.
విషయం గుర్తించిన వెంటనే బేడీలను తొలగించి సాధారణ తాళం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రజలకు చట్టం, క్రమశిక్షణపై అవగాహన కల్పించే పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని సిబ్బంది నిర్లక్ష్యంగా అభివర్ణించారు.



