రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో వెయ్యి మందితో మహా పాదయాత్ర
జగ్గారెడ్డి–నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నల్ల టీషర్టులతో కాంగ్రెస్ నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్): నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనలకు మద్దతుగా సంగారెడ్డిలో గురువారం మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల టీషర్టులు ధరించి మహా పాదయాత్ర నిర్వహించారు.
పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ నుంచి గంజి మైదాన్ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



