ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్): ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో చేపడుతున్న స్థిరకాల నియామకాలలో స్థానికులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన ఎద్దుమైలారం, క్యాసారం, ఇంద్రకరణ్, చెర్యాల్, సింగాపూర్ గ్రామాల అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం చేపడుతున్న నియామకాలలో గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాలుగా నిర్ణయించడం వల్ల, ఫ్యాక్టరీలో ఇప్పటికే పనిచేసి అనుభవం పొందిన అనేక మంది అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని యాజమాన్యం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, నియామక ప్రక్రియను చెన్నైలో కాకుండా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ప్రాంగణంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గొల్లపల్లి జయరాజు హెచ్చరించారు.



