ఆగస్టు 1న ఛలో హైదరాబాద్’ మహాధర్నా ను విజయవంతం చేయాలి
ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న ఛలో హైదరాబాద్' మహాధర్నా

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (రథసారథి న్యూస్): ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడంతో పాటు 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని కోరారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సమగ్ర శిక్ష, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లకు 12 నెలల వేతనం చెల్లించాలని, 2008లో నియమితులైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను కూడా ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది.


