ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి
కార్మికుల కనీస వేతనం రూ.42 వేలుకు పెంచాలని సీఐటీయూ డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్):
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని, ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్ పిలుపునిచ్చారు. కొండాపూర్ మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.42 వేలుకు పెంచాలని, నాలుగు లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, సమ్మె హక్కు, ఎనిమిది గంటల పని విధానాన్ని పరిరక్షించాలని, రైతులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆగస్టు 10న జరిగే దేశవ్యాప్త ‘జైల్ భరో’ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, నరసింహారెడ్డి, సీఐటీయూ మండల నాయకులు బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, ఎస్ఎఫ్ఐ నాయకులు అర్జున్, అవినాష్, సీఐటీయూ నాయకులు సంజీవులు, రైతు సంఘం నాయకుడు అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మధు తదితరులు పాల్గొన్నారు



