మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.28 లక్షల డెత్ రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
-ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని కార్మికులకు సూచించిన యూనియన్, యాజమాన్యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): కిర్బీ పరిశ్రమలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడు కే. మల్లేష్ కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ కింద రూ.28 లక్షల చెక్కును బుధవారం అందజేశారు. పరిశ్రమలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజమహేందర్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతిమేల మాణిక్ గౌడ్, అధ్యక్షుడు కే. రాజయ్య, జనరల్ సెక్రటరీ వి.ఎస్. రాజు తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కిర్బీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమం కోసం డెత్ రిలీఫ్ ఫండ్ అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ నిధికి కార్మికులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందిస్తుండగా, యాజమాన్యం దానికి రెండింతల మొత్తాన్ని జతచేసి మృత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తోందని వివరించారు. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే డెత్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందిన ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాలకు, భవిష్యత్ భద్రతకు ఉపయోగించుకోవాలని, అనవసర ఖర్చులకు వినియోగించవద్దని వారు సూచించారు.



