
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్):
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సంగారెడ్డి పట్టణానికి చెందిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ గత 18 ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ‘మట్టి గణపతే మహా గణపతి’ అనే నినాదంతో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది కూడా 5,016 మట్టి వినాయక ప్రతిమలను సిద్ధం చేయగా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, జిల్లా జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు బండారు యాదగిరి, ఉపాధ్యక్షులు మ్యాడమ్ రాధాకిషన్, ఆమేటి మహేందర్, కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు నామా భాస్కర్, జూలకంటి మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



