సంగారెడ్డి నూతన బస్టాండ్లో తల్లిపాల గది ప్రారంభం
-ప్రయాణించే తల్లులకు ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): సంగారెడ్డి నూతన బస్టాండ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘ఆడపిల్లను కాపాడండి–ఆడపిల్లను చదివించండి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన తల్లిపాల గదిని మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణించే తల్లులు తమ శిశువులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు ఈ గది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడంతో పాటు, మహిళలు, శిశువుల సంక్షేమానికి ఇటువంటి సౌకర్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి బస్టాండ్ నిర్వహణాధికారి సుధాకర్ రావు, శిశు అభివృద్ధి పథకం అధికారి చంద్రకళ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం, అంగన్వాడీ పర్యవేక్షకులు, లింగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.



