
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్):
హత్నూర సమీపంలోని పురాతన దత్తలయ్య గుట్టలో వెలసిన దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యు డబ్ల్యూ జె- ఐ జె యు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి సోమవారం సందర్శించారు. దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ సభాపతి శర్మ ఆధ్వర్యంలో పూజారులు చంద్రప్రకాష్ శర్మ, సూర్య ప్రకాష్ శర్మ అర్చన జరిపారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ మర్యాదలతో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరిని సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ…
ఈ దత్తాత్రేయ క్షేత్రానికి 650 సంవత్సరాల చరిత్ర ఉన్నదని అన్నారు.ఈ క్షేత్రంలో ఏటా గురు పౌర్ణమిని పురస్కరించుకొని మూడు రోజులపాటు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందుకని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు తో పాటు పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు.ఈసారి కూడా సోమవారం ఉదయం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, చండీ హోమం, ద్వీప ప్రజ్వలన జరిపారు. దత్తాత్రేయునికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు.
గురు పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ సభాపతి శర్మ తెలిపారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) మాజీ ప్రధాన కార్యదర్శి పానుగంటి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు శివన్న జైన్ ,వెన్న చక్రేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.



