ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై అధికారుల అవగాహన
-జిల్లా సమాఖ్య సమావేశంలో పలు శాఖల అధికారుల వివరణ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): జిల్లా సమాఖ్య (107) సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి అధ్యక్షతన బుధవారం నిర్వహించబడింది. సమావేశంలో ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) జ్యోతి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జానకి రెడ్డి, అదనపు డీఆర్డీఓ–డీఆర్డీఏ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్వో) అధికారులు, వయోజన విద్య శాఖ ఉప సంచాలకులు, టాస్ జిల్లా కోఆర్డినేటర్, ఎస్బీఐ ఆర్సెటీఐ మేనేజర్, సహాయ బీసీ సంక్షేమ అధికారి, ఏడీ–ఎన్ఏసీ, డీసీసీబీ జనరల్ మేనేజర్, ఎస్పీఎం–సెర్ప్ తదితర శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల కార్యక్రమాలు, అమలు తీరును వివరించారు.
అనంతరం మండల సమాఖ్య అధ్యక్షులు అడిగిన సందేహాలకు సంబంధిత అధికారులు సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడానికి అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని 23 మంది మండల సమాఖ్య అధ్యక్షులు, డీపీఎంలు పాల్గొన్నారు.



