బాలసదన్లో ఆకస్మిక తనిఖీ
-విద్యార్థుల సంరక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (రథసారథి న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు సంగారెడ్డిలోని బాలసదన్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బాలసదన్లోని విద్యార్థుల వసతి, భోజనం, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆమె, పిల్లల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తూ, వారి ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై నిరంతరం శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వసతి గృహం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పిల్లల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, న్యాయపరమైన సమస్యలు ఎదురైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అవసరమైన వారు సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి సేవలు పొందాలని ఆమె సూచించారు.



