ఎల్-నినో ప్రభావంపై సమీక్షా సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు చేపట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను నిలదీశారు

సంగారెడ్డి ప్రతినిధి , జూలై 20 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు చేపట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను నిలదీశారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎల్-నినో ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గానికి మంజూరైన నాలుగు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలంటే సబ్స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఎస్ఈ, నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
అలాగే సదాశివపేట పట్టణంలోని 8, 9 వార్డుల పరిధిలోని సిద్ధాపూర్ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొంటూ, పనులను వేగవంతం చేసి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామిని కోరారు.
వేసవి పరిస్థితులు, ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.



