సదాశివపేట లో జగన్నాథ రథ యాత్ర ను ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
సదాశివపేట పట్టణం లో ఇస్కాన్ ఆధ్వర్యం లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
ఈ రథయాత్ర సదాశివపేట దుర్గమ్మ గుడి నుండి ప్రారంభమై శాస్త్రి రోడ్, హైవే, సుభాష్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా బసవ సదన్ వరకు సాగింది. రథం కదిలిన వెంబడి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జగన్నాథ్ కీ జై’ అంటూ హరినామ స్మరణ చేశారు. యాత్ర పొడవునా భక్తులు చేసిన భజనలు, ఆధ్యాత్మిక నాట్యాలు, సంకీర్తనలతో పట్టణ వీధులన్నీ భక్తిపారవశ్యంతో మారుమోగాయి.
ముఖ్యంగా మహిళా భక్తులు సాంప్రదాయ దుస్తులలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, వీక్షకులను అలరించాయి. భక్తులకు ఎక్కడికక్కడ ఇస్కాన్ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సదాశివపేట పట్టణంలో జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న ఇస్కాన్ స్థానిక శాఖ ప్రతినిధులను నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లో సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లె అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, నాయకులు సత్యనారయణ, పృధ్వీ రాజ్, ఇస్కాన్ ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



